11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్

VijayaBhaskar · March 30, 2026
Spread the love

బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చిన మార్ష‌ల్స్

హైద‌రాబాద్ : తెలంగాణ శాసన మండలి నుంచి 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు స‌స్పెండ్ అయ్యారు. సోమవారం ఉదయం సమావేశాలు తిరిగి ప్రారంభమైన కొద్ది నిమిషాలకే, సభ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. సభలో నిరసన తెలిపినందుకు హైదరాబాద్‌లోని తెలంగాణ శాసన మండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను మార్షల్స్ బయటకు తీసుకు వ‌చ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘ‌వ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించిన విషయంపై విచారణ జరిపేందుకు ఒక సభా కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.

దీంతో సభకు అంతరాయం కలిగించినందుకు 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను తెలంగాణ శాసన మండలి నుంచి సస్పెండ్ చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుకేందర్ రెడ్డి సభ్యులను తమ తమ స్థానాలకు తిరిగి వెళ్లి, సభా కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూడాలని పదేపదే కోరారు. అయినా బేఖాత‌ర్ చేశారు. దీంతో వారు వెనక్కి తగ్గక పోవడంతో, శాసన వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు ఈ విషయమై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం, ఛైర్మన్ వారిని ఆ రోజుకు సస్పెన్షన్‌లో ఉంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.