ఆదేశించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : పవిత్ర జ్ఞాన సరస్వతి ఆలయ క్షేత్రాన్ని మరింత అందంగా, సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. శనివారం హైదరాబాద్ లో బాసర అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ లో పలు మార్పులు చేర్పులు సూచించారు సీఎం. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆలయ పరిసరాల్లో EV వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలని అన్నారు. కేవలం భక్తికి మాత్రమే చోటు ఉండాలని పేర్కొన్నారు. ప్రతి నిత్యం ఎంత మంది భక్తులు వస్తున్నారని, ఇప్పటి వరకు ఏమేం పనులు చేపట్టారో తెలియ చేయాలని స్పష్టం చేశారు. ఈ కీలక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, ప్రభుత్వ సలహాదారులు, ఇతరులు పాల్గొన్నారు.






