నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గత వైసీపీ పాలన పై మండిపడ్డారు. ప్రత్యేకించి మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయన నిర్వాకం వల్లనే ఏపీ అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైందన్నారు. గత పాలకులు ఆకలి తీర్చే అన్నపూర్ణ వంటి అన్న క్యాంటీన్లపైనా దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కడుపు నింపుతున్న పథకాన్ని నిలిపి వేశారని ఆరోపించారు. వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా అన్నదానం చేస్తుంటే దానిలో మట్టి పోసి, దాడులు చేసి అడ్డుకున్నారని వాపోయారు సీఎం.
వైసీపీకి కావాల్సింది విధ్వంసం, హింస, కూల్చడం, నరకడం, నాశనం చేయడమే తప్పా మరోటి కాదన్నారు. ఏ రాజకీయపార్టీ అయినా ప్రజలకు ఏం చేస్తామో చెబుతుంది. కానీ వైసీపీ మాత్రం రప్పా రప్పా చేస్తాం అంటుందన్నారు . ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు నారా చంద్రబాబు నాయుడు, 2029లో విధ్వంసం చూపిస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. అందుకే ఆ పార్టీ పేరు గొడ్డలి పార్టీగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హత ఆ పార్టీకి లేదు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.





