సంచలన కామెంట్స్ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి : జువ్వల దిన్నె పై మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేనే లేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 650 హార్స్ పవర్ ఇంజిన్లతో గస్తీ బలపరిచి, అక్రమంగా వచ్చిన బోట్లను నియంత్రించే చర్యలు చేపట్టిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కిందన్నారు. తమిళనాడు బోట్లను పట్టుకున్న తర్వాత యువనేత నారా లోకేష్ చెప్పడం వలనే ఆ బోట్లను పోలీసులు విడుదల చేశారు అనడం కూడా పూర్తిగా అవాస్తవం అన్నారు. “ఇది మా గ్రామాల సమస్య, మేము చర్చించుకొని పరిష్కరించు కుంటాం” అని స్థానిక గ్రామాల ప్రజలు చెబితే వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ, వారి నిర్ణయాల ప్రకారమే ముందుకు వెళ్లాం అన్నారు. అయినా కూడా ఈ అంశాన్ని రాజకీయంగా మలచాలని జగన్ చేసిన ప్రయత్నం బాధాకరం అన్నారు కొల్లు రవీంద్ర.
జువ్వలదిన్నెలో కేంద్ర అనుమతితో సాగర్ డిఫెన్స్ సంస్థకు భూమి కేటాయించడం జరిగిందని చెప్పారు. ఇది దేశ రక్షణకు ఉపయోగపడే కీలక ప్రాజెక్ట్. భవిష్యత్తులో సముద్ర తీర ప్రాంత భద్రతను బలోపేతం చేయడంలో ఈ సంస్థ చేసే పరిశోధనలు ఎంతో ఉపయోగ పడతాయని అన్నారు. ఇలాంటి ప్రాజెక్టులను వ్యతిరేకించడం ద్వారా జగన్ దృష్టిలో దేశ ప్రయోజనాలపై ఎంత నిర్లక్ష్యం ఉందో తెలుస్తోందన్నారు కొల్లు రవీంద్ర. “మొత్తం హార్బర్ను సాగర్ డిఫెన్స్కు ఇచ్చేస్తున్నారు” అంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిజానికి, కేవలం 170 మీటర్ల ప్రాంతాన్ని మాత్రమే ఆ సంస్థకు కేటాయించాం అన్నారు. కనీస అవగాహన లేకుండా ప్రజల్లో అపోహలు సృష్టించడం దురదృష్టకరం అని అన్నారు మంత్రి. రాష్ట్ర ప్రజలు ఓటు వేయలేదని రాష్ట్రం నాశనం అయిపోవాలని జగన్ కోరుకుంటున్నాడని ఆరోపించారు.





