పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ తేజస్వి సూర్య. గురువారం పార్లమెంట్ సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడల్ ఏమాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు. రేవంత్ ప్రతిపాదనలు అమలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు ఎంపీ.
ఒక వ్యక్తి – ఒక ఓటు, ఒక ఓటు – ఒకే విలువ అనే ప్రాథమిక సూత్రానికి భంగం కలిగించే ప్రతిపాదన ఇది అని పేర్కొన్నారు. అత్యంత ప్రమాదకరమైన ప్రతిపాదన అంటూ మండిపడ్డారు తేజస్వి సూర్య.
పేదోడికి ఒక ఓటు ఉంటే అంబానీకి లక్ష ఓట్లు ఇవ్వాలన్నట్లు ఉందన్నారు. జీఎస్డీపీ ఏటా ఒకే రకంగా ఉండదన్నారు బీజేపీ ఎంపీ. ఆదాయం పెరిగినప్పుడు ఎక్కువ సీట్లు ఇచ్చి జీడీపీ తగ్గినప్పుడు సీట్లు తగ్గించాలా అని ప్రశ్నించారు. డీ లిమిటేషన్ పై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పునర్విభజన వల్ల ఏ మాత్రం అన్యాయం జరిగినా బిల్లును వ్యతిరేకించే వాడిని అన్నారు. బీజేపీ ఎంపీగా బిల్లును సమర్థించడం లేదన్నారు.





