20న జరిగే కేసీఆర్ సభపై విస్తృత చర్చలు
జగిత్యాల జిల్లా : భారత రాష్ట్ర సమితి పార్టీ బాస్ , మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈనెల 20న జగిత్యాల జిల్లాకు రానున్నారు. ఈ సందర్బంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. తాజాగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అధికారికంగా కేసీఆర్ సమక్షంలో ప్రజల సాక్షిగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై సీనియర్ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. సభను సక్సెస్ చేసేందుకు బావ బావమర్దులు కేటీఆర్, తన్నీరు హరీశ్ రావులు శనివారం జగిత్యాలకు చేరుకున్నారు. ఈ సందర్బంగా వారు నేరుగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనతో సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే జీవన్ రెడ్డి తన ప్రాథమిక సభ్యత్వానికి , కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నేరుగా ఆయన కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. ఒకరినొకరు శాలువాలు కప్పుకున్నారు. తామిద్దరి మధ్య 40 ఏళ్ల రాజకీయ , వ్యక్తిగత అనుబంధం ఉందని ఇప్పటికే ప్రకటించారు జీవన్ రెడ్డి. కాగా చాలా మంది తను భారతీయ జనతా పార్టీలోకి వెళతారని భావించారు . కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు.






