మహిళా బిల్లును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ర్యాలీ
తూర్పుగోదావరి జిల్లా : విపక్షాలపై విరుచుకు పడ్డారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మహిళా బిల్లును అడ్డుకోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఆడబిడ్డలంటే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలకు ఇంత చులకనా? అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. మద్దతు ఇవ్వాల్సింది పోయి అడ్డుకుంటే ఎలా అని నిలదీశారు సీఎం.
నిన్న జరిగిన విద్రోహాన్ని ప్రతీ ఇంటికీ తీసుకెళ్తాం అన్నారు. ఇవాళ చేపట్టిన నిరసన ఆరంభం మాత్రమేనని ప్రకటించారు. దీనిపై పవన్ కల్యాణ్ తో మాట్లాడానని చెప్పారు. ఎన్డీఏ పక్షాలతో పాటు ఇతర పార్టీలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు సీఎం.
మహిళలను ఓటు అడిగే పార్టీలు మహిళా సాధికారతను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 2017లో టీడీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బిల్లు కూడా తీసుకు రాలేక పోయారంటూ ఎద్దేవా చేశారు. 2023లో బిల్లు ప్రవేశ పెట్టినా దీనిని అమలు చేసే నిబంధన పెట్టారని అన్నారు. 2029లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతోనే సవరణ బిల్లు తీసుకు వచ్చారని తెలిపారు. కావాలనే కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీలన్నీ ఈ బిల్లుకు 2/3 మంది సభ్యుల మద్దతు రాకుండా అడ్డుకున్నాయని ఆరోపించారు.






