పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’లో పాల్గొన్నారు. ప్రతీ నెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కోసం ఉద్యమంలా పని చేస్తున్నాం అని చెప్పారు. ‘జలధార-జలహారతి’ థీమ్తో ఈ నెల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాలను ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
స్వచ్ఛాంధ్ర స్టాళ్లను సందర్శించి ప్రజలతో మాట్లాడారు సీఎం. మాలకోడు చెరువు పునరుద్ధరణ, కంపోస్టింగ్ విధానాలపై నిపుణులు, మహిళలతో చర్చించారు. చెత్త నుంచి సంపద తయారీతో స్వయం సహాయక సంఘాలు ఆదాయాన్ని పొందడం స్ఫూర్తి దాయకం అని ప్రశంసలు కురిపించారు. స్థానికుల సమస్యలు, వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా శాశ్వత పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశారు నారా చంద్రబాబు నాయుడు.





