ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం
అమరావతి : ఉద్యోగుల హక్కుల కోసం పోరాడటం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఉద్యోగ సంఘం నాయకుడు వెంకట్రామి రెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించడం పట్ల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గతంలో సీఐ శంకరయ్య విషయంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు. మా చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరగని విషయాలను జరిగినట్లుగా సీఎం స్థాయిలో మీరు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని, అది తనను బాధించిందని శంకరయ్య అంటే అతన్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించడం మీ నిరంకుశ పాలనకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా అర్థం అని పేర్కొన్నారు.
ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3వేల చొప్పున భృతి ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా? ప్రతి ఇంటికీ బాండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. పైగా ఉద్యోగులపై కక్ష సాధింపులు ఇది జంగిల్ రాజ్ కాదా? ఉగాది రోజున మీ జీతాలు డబుల్ చేస్తామని వాలంటీర్లకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కడుపుకొట్టింది నువ్వు కాదా? అని తీవ్ర స్తాయిలో మండిపడ్డారు జగన్ రెడ్డి. 2.60 లక్షల మందిని రోడ్డున పడేసి, ఆ వ్యవస్థే లేకుండా చేసిన అరాచకత్వం నీదేకదా? మీ కక్ష సాధింపులకు, మీరు ఉద్యోగులపై పెట్టే ఒత్తిడులకు ఒక్క సచివాలయ ఉద్యోగులే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మందికి పైగా ఆకస్మిక మరణం పొందింది నిజం కాదా? అని సంచలన ఆరోపణలు చేశారు.





