సమ్మె విరమించక పోతే చర్యలు తప్పవు
హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి. ఆయన కీలక ప్రకటన చేశారు. సమ్మె చట్ట విరుద్దమన్నారు. ఇలాగే సమ్మెను కొనసాగిస్తే సమ్మెలో పాల్గొన్న కార్మికులపై చర్యల తప్పవని వార్నింగ్ ఇచ్చారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వారి వద్ద ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ ప్రక్రియ ముగియక ముందే సమ్మెకు వెళ్లడం చట్టరీత్యా చెల్లదని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధమైన సమ్మెలో పాల్గొనడం వల్ల వేతన కోతతో పాటు, ఉద్యోగ నిబంధనల ప్రకారం కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.
ఇది కార్మికుల భవిష్యత్తుపై, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు ఎండీ.
సంస్థ, కార్మికుల సంక్షేమం దృష్ట్యా, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించు కోవడానికి యాజమాన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు నాగిరెడ్డి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, సంస్థ ప్రతిష్ఠను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సిబ్బంది సమ్మెను విరమించాలని, అందరూ విధుల్లోకి హాజరు కావాలని ఎండీ కోరారు.





