స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్ : వచ్చే జూన్ 8వ తేదీ లోపు పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ , క్యాపిటల్ వర్క్స్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సహచర మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్నారు.రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల క్రితమే నిర్మించినప్పటికీ, అప్రోచ్ రోడ్లు లేక నిరుపయోగంగా ఉన్న వంతెనల పనులపై అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించామన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రూ.148 కోట్ల నిధుల విడుదలకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పనులు పూర్తి చేయాలన్నారు. ఈ పనుల పురోగతిని ప్రతి వారం తాను స్వయంగా సమీక్షిస్తానని చెప్పారు. టెండర్ల ప్రక్రియ నుండి పనులు పూర్తయ్యే వరకు కఠిన పర్యవేక్షణ ఉంటుందన్నారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా, నిర్ణీత గడువులోగా ఈ వంతెనలను ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడమే మా ప్రభుత్వ లక్ష్య అన్నారు.





