అన్ని డిమాండ్లకు ఓకే చెప్పిన ప్రభుత్వం
హైదరాబాద్ : తమ ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె బాట పట్టిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సారథ్యంలో ఏర్పాటైంది మంత్రివర్గం. ఈ కీలక సమావేశంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ గౌడ్ తో పాటు ఆర్టీసీ జేఏసీ నేతలు, ఎండీ వై. నాగిరెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా తీవ్ర వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. చివరకు ఆర్టీసీ జేఏసీ నేతలు తమ ముందు వుంచిన డిమాండ్లకు తల దించక తప్పలేదు సర్కార్ కు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఆర్టీసీ ఒక పెద్ద కుటుంబం అన్నారు. వారు కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా పాలన ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ నాయకులతో జరిపిన చర్చలు విజయవంతమైనట్లు తెలిపారు భట్టివిక్రమార్క. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని, వెంటనే ఏర్పాట్లు చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించామన్నారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న విలీనం అంశంపై అధికారులు, కార్మిక నాయకులతో అధికారిక కమిటీ ఏర్పాటు. ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించామన్నారు.





