డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో
అమరావతి : ఏపీ సర్కార్ సంచలనం సృష్టించింది. జాతీయ స్థాయి పంచాయతీ అవార్డులలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ విభాగం విశేష ప్రతిభ కనబరిచింది. మహిళా స్నేహ పూర్వక పంచాయతీ విభాగంలో తిరుపతి జిల్లాకు చెందిన బొక్కసంపాళెం గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. సుపరిపాలన (Good Governance) విభాగంలో విశాఖపట్నం జిల్లాలోని శృంగవరం గ్రామ పంచాయతీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలన , మెరుగైన జీవనోపాధి విభాగంలో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన చెమ్ముళ్లపల్లి గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం దక్కింది. స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల విభాగంలో ప్రకాశం జిల్లాలోని గుండమాల గ్రామ పంచాయతీ తృతీయ స్థానాన్ని పొందింది.
మండలం లేదా బ్లాక్ స్థాయిలో అందించే ప్రతిష్టాత్మక నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారానికి గాను చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో నిలిచింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిరంతర సహకారంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు చేరే వరకు పని చేస్తుంది. గ్రామాలకు నిర్మిస్తున్న రోడ్లతో స్వయం సమృద్ధ వ్యవస్థను తీర్చి దిద్దుతున్నామన్న పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రగతి పథంలో అగ్రగామిగా నిలుపుతోంది.





