మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ఆవేదన
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలిదానం పట్ల తీవ్రంగా స్పందించారు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్. ఆయన ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ఆత్మహత్యకు పాల్పడవద్దని కోరారు. తెలంగాణ చరిత్రలో శంకర్ గౌడ్ చిరస్థాయిగా నిలుస్తారని పేర్కొన్నారు. ఆవేశంతో ఆయన చేసిన త్యాగం తనతోటి వారికి వెన్నుదన్ను, కానీ ఆయన కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని వాపోయారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి, వివిధ స్థాయిల్లో చర్చలు జరుపుతున్నా, ఆందోళన చెందుతున్న వారికి విశ్వాసం కలగడం లేదన్నారు. దీని వల్లనే ఇలాంటి ఘటనలకు కారణాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాపోలు ఆనంద భాస్కర్. ఈ ఘటనలు దృష్టికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి స్పందించి, మంత్రుల బృందాన్ని రంగంలోకి దింపినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు శాంతియుతంగా చర్చలు జరపాలని కోరారు మాజీ ఎంపీ.
ఉద్యోగులు, కార్మికులు తమ డిమాండ్లను సాధించు కోవడం కోసం ఆందోళన వారి హక్కు అని పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెగించి పోరాడారని గుర్తు చేశారు.. వారి పోరాటం తెలంగాణ ఉద్యమంలో కీలకమైనదని కొనియాడారు.





