newsseals.com
News

దివ్యాంగుల జీవ‌నోపాధి కోసం కృషి చేస్తాం

VijayaBhaskar April 25, 2026
newsseals-MinisterJupally
Spread the love

మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కీల‌క ప్ర‌క‌ట‌న

ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా : దివ్యాంగుల జీవ‌నోపాధి కోసం త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. శ‌నివారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఆవరణలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి 44 మంది దివ్యాంగులకు వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు 17 ల్యాప్‌టాప్‌లు, 2 సెల్‌ఫోన్లను అందజేశారు. 20 మంది బాలికలకు సైకిళ్లు, 6 మోటార్ వీల్‌చైర్లు, 10 బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఒక బ్యాటరీ ఆటోను అందించారు. దివ్యాంగుల జీవనోపాధిని మెరుగు పర్చడం, వారి స్వయం ఆధారిత జీవనానికి తోడ్పడడం లక్ష్యంగా ఈ ఉపకరణాలను అందజేస్తున్నాం అన్నారు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అవుతున్నాయని చెప్పారు.

క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయం అని స్ప‌ష్టం చేశారు. దివ్యాంగుల సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం అన్నారు. దివ్యాంగులు సమాజంలో ఎవరికీ తీసిపోరు అని పేర్కొన్నారు. వారికి అందరితో సమానంగా గౌరవం, అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు జూప‌ల్లి కృష్ణారావు. వారిని స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించేందుకు మరిన్ని వినూత్న పథకాలను ప్రవేశ పెడతాం అన్నారు జూప‌ల్లి కృష్ణారావు.