డీజిల్ కొరత లేకుండా చేస్తామన్న అచ్చెన్న
విజయవాడ : వరి కోతలు పెరుగుతున్న సమయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. డీజిల్ కొరత లేకుండా చూస్తామన్నారు. ఇదే సమయంలో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుని వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. కోతకు వచ్చిన వరి తడిసి పోకుండా రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వాలని, అన్ని అగ్రికల్చర్ అధికారులు ఫీల్డ్లో అందుబాటులో ఉండి రైతులను సకాలంలో గైడ్ చేయాలని ఆదేశించారు. సివిల్ సప్లైస్ శాఖతో సమన్వయం పెంచి అవసరమైన టార్పాలిన్ పట్టాలను తక్షణం సరఫరా చేయాలని, బ్యాంక్ గ్యారెంటీ 1:3 విధానంలో సహకారం అందించాలని కోరారు.
జిల్లా కలెక్టర్లు ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరిపి ఎక్కడా డీజిల్ సరఫరా నిలిచి పోకుండా చూడాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలో రోజువారీగా పరిస్థితిని సమీక్షిస్తూ ఎక్కడైనా లోపం ఉంటే వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే 2–3 వారాలు అత్యంత కీలకమైన కాలమని, ఈ సమయంలో ఎక్కడా కోతలు ఆగకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా డీజిల్ సరఫరా , పంట రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు.





