షాకింగ్ కామెంట్స్ చేసిన వీరేంద్ సెహ్వాగ్
న్యూఢిల్లీ : భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కు కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేదన్నాడు. భారత జట్టుకు సంబంధించి టి20 ఫార్మాట్ లో నాయకత్వ పాత్రకు సంజు సామ్సన్ ఇంకా చాలా దూరంలో ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. అతను ప్రస్తుతం బాగా ఆడుతున్నాడని, నిర్భయంగా కనిపిస్తున్నాడు, కానీ నిలకడ అనేది ఇంకా ప్రశ్నార్థకంగా మారిందన్నాడు సెహ్వాగ్. అతను ఇంకా జట్టులో శాశ్వత ఆటగాడు కూడా కాదన్నాడు. కాబట్టి కెప్టెన్సీ గురించి ఆలోచించడం చాలా తొందరపాటు అవుతుందని పేర్కొన్నాడు.
ఇక ఒక జట్టుకు కెప్టెన్ కావాలంటే చాలా సంయమనం, నిబద్దత అనేది ఉండాలన్నాడు. ఒక కెప్టెన్ నమ్మదగిన వాడిగా ఉండాలని, అంతే కాకుండా జట్టుకు అవసరమైనప్పుడు జట్టును నడిపించేందుకు ముందు వరుసలో నిలవాలని కానీ అవేవీ సంజు శాంసన్ లో లేవన్నాడు సెహ్వాగ్. ప్రస్తుతానికి, శ్రేయస్ అయ్యర్ ఉత్తమ ఎంపికగా కనిపిస్తున్నాడని తెలిపాడు. జట్టులో రెగ్యులర్గా ఉంటాడు, పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటాడు, ఇప్పటికే పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ జట్లను ఫైనల్స్కు, టైటిల్స్కు నడిపించాడు. అతను నిలకడగా రాణిస్తున్నాడని, ఈ పాత్రకు అర్హుడని చెప్పాడు.






