కీలక ప్రకటన చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోతున్న వారందరినీ ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఎవరికో నష్టం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. మీ పిల్లలు చదువుకున్న వారైతే స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అన్నారు. పేదల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం భూములు ఇస్తున్నారని, వారిని గౌరవించాలి. వారి బాధలు వినాలని ఉన్నతాధికారులు, కలెక్టర్ కు స్పష్టం చేశారు.
ప్రపంచంలో అద్భుతమైన నిర్మాణాలు ఇక్కడ వస్తాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టని వారు భవిష్యత్తులో ఏదో కోల్పోయామన్న బాధ పడాల్సి వస్తుందన్నారు. శంషాబాద్ రాబోయే కాలంలో బుల్లెట్ ట్రైన్ హబ్ గా మారనుందని ప్రకటించారు సీఎం. బుల్లెట్ ట్రైన్స్కు తోడు ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలును అనుసంధానం చేయబోతున్నాం అన్నారు. బుల్లెట్ ట్రైన్ హబ్తో పాటు మెట్రో, అతిపెద్ద బస్ టర్మినల్ కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. ఇవన్నీ పూర్తిచేయాలంటే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం అవసరం అన్నారు. అభివృద్ధి పనులు వేగంగా చేయాలన్న ఆలోచనలో చిన్నచిన్న తప్పిదాలు దొర్లితే అవి ఉద్దేశ పూర్వకంగా చేసినవి కాదన్నారు.






