కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్ : సేవాదళ్ వాలంటీర్లు చేస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న ‘సమర్థ్’ శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి నేటి వరకు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడంలో సేవాదళ్ వాలంటీర్లు ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలను సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరు బలమైన వారధిలా పని చేస్తున్నారని అన్నారు. ఇటువంటి శిబిరాల ద్వారా కార్యకర్తల్లో నాయకత్వ పటిమతో పాటు ఆత్మ విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. ఇది పార్టీ బలోపేతానికి ఎంతగానో దోహద పడుతుందన్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ‘నేను.. నాది’ అనే స్వార్థం పెరిగి పోయి, ‘మనం.. మనది’ అనే సామాజిక స్పృహ తగ్గి పోతోందని ఆవేదన చెందారు జూపల్లి. రాజకీయాల్లో కేవలం ఎలా సంపాదించు కోవాలనే ధ్యాస పెరిగి, సేవాభావం క్రమంగా క్షీణిస్తోందని అన్నారు. సమాజంలో నేటికీ ఎంతోకొంత విలువలు మిగిలి ఉన్నాయంటే అది సేవాదళ్ వంటి నికార్సైన నాయకులు, వాలంటీర్ల కృషి వల్లే. మారుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యర్థులు సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న అసత్య ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టేలా కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడుతున్న సేవాదళ్ కార్యకర్తలకు గుర్తింపు దక్కేలా చూస్తానని అన్నారు.





