సంచలన ప్రకటన చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా తమ కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. కేవలం తమ సంస్థలకు సంబంధించిన కార్యక్రమానికి హాజరు కావాలని కోరేందుకు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం జరిగిందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. పార్టీ మారబోవడం లేదన్నారు మల్లారెడ్డి.
పార్టీ మారుతున్నారనే ప్రచారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదన్నారు. అవన్నీ అవాస్తవ ప్రచారాలే అని ఆయన కొట్టి పారేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి ఎలాంటి సందేహాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాజాగా జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో మల్లారెడ్డిపై సీరియస్ అయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.





