10వ త‌ర‌గ‌తి రిజ‌ల్ట్స్ లో ఏపీ టాప్

VijayaBhaskar · May 1, 2026
Spread the love

బాలిక‌లు మెరుగైన ఫ‌లితాలు

అమ‌రావ‌తి : విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్ర‌ణాళిక‌-దాని అమ‌లును నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌డం, అధికార యంత్రాంగం అలుపెరుగ‌ని కృషి ఫలితంగా మార్చి 2026 ప‌దోత‌ర‌గ‌తి పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. గ‌త ఏడాది 81.1 శాతం ఉత్తీర్ణత న‌మోదు కాగా, ఈ ఏడాది 100 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక విజ‌య‌వంత‌మై 85.25 శాతానికి ఉత్తీర్ణ‌త పెరిగింది. అన్ని ప్ర‌భుత్వ యాజ‌మాన్య పాఠ‌శాల‌ల్లో గ‌తేడాది 72.8 శాతం ఉన్న ఉత్తీర్ణ‌త ఈ సంవ‌త్స‌రం 78.39 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ప‌రీక్షా ఫ‌లితాల్లో బాలుర కంటే బాలిక‌లు ఉత్తీర్ణ‌తా శాతం ఎక్కువ సాధించారు. బాలుర ఉత్తీర్ణత 82.68శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత 87.90 శాతంగా ఫ‌లితాల్లో తేలింది. బాలుర కంటే బాలికలు 5.22 శాతం మెరుగైన ఫలితాలను సాధించి భ‌ళా బాలిక అనిపించుకున్నారు.

రాష్ట్రంలో మొత్తం 12089 స్కూళ్లు ఉండ‌గా, ఇందులో ప్ర‌భుత్వ యాజ‌మాన్య పాఠ‌శాల‌లు 6785 , ఎయిడెడ్ స్కూళ్లు 260, ప్రైవేటు స్కూళ్లు 5044 ఉన్నాయి. వీటిలో సున్నా శాతం ఫలితాలు వచ్చిన పాఠశాలలు 16. వీటిలోనూ ప్రైవేట్ స్కూళ్లు 11 కాగా, 2 ఎయిడెడ్‌, 2 ఆశ్ర‌మ పాఠ‌శాల‌లు, 1 జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్ ఉంది. మొత్తంగా చూస్తే ప్ర‌భుత్వ యాజ‌మాన్య పాఠ‌శాల‌ల్లో సున్నా ఫ‌లితాలు వ‌చ్చిన‌వి కేవ‌లం 5గా ఉండి ప్ర‌భుత్వ విద్య నాణ్య‌తకు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి.