సిద్దాంత పరమైన విభేదాల కారణంగానే విమర్శలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ పై. తండ్రిగా ఆయనతో తనకు ఎలాంటి సమస్య లేదన్నారు. సిద్దాంతపరమైన విబేధాలతోనే విమర్శలు చేశానని…రాజకీయ తప్పులపై భవిష్యత్ లోనూ విమర్శలు చేస్తానని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంతో చేయాల్సి ఉన్నప్పటికీ కేసీఆర్ అది చేయలేక పోయారన్నారు. కృష్ణా, గోదావరి నీళ్లను సరిగా వాడుకొని ఉంటే రైతుల చేతిలో రెండున్నర లక్షల కోట్లు ఉండేవని చెప్పారు. లక్షా 21 వేల కోట్లు కాళేశ్వరం, పాలమూరు కోసం ఖర్చు చేసి కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో పెట్టిన పరీక్షల్లో పదిసార్లు పేపర్ లీక్ అవటాన్ని ప్రస్తావించారు.
కేటీఆర్ లాంటి తెలివైన ఐటీ మినిస్టర్ ఉండగా ఎందుకు పేపర్ లీకైందంటూ ప్రశ్నించారు. కేసీఆర్ చర్యల కారణంగా రెండు జనరేషన్లు నష్ట పోయారన్నారు. లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అనే విషయంలో కేసీఆర్ చేసిన తప్పులను మాత్రమే ప్రశ్నించానని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన అని ముందు ప్రకటించిన తర్వాత తెలంగాణ రక్షణ సేన గా పేరు మార్చుకోవటాన్ని జర్నలిస్టులు ప్రశ్నించారు. ఐతే తమ పార్టీ పేరు విషయంలో చాలా కుట్రలు జరిగాయని కవిత చెప్పారు. వాటిని గమనించిన తర్వాతే పార్టీ పేరు విషయంలో వ్యుహత్మకంగా వ్యవహరించామని అన్నారు. కావాలనే రకరకాల పేర్లను ప్రచారంలోకి తెచ్చామని చెప్పారు. ఐతే టీఆర్ఎస్ అనే పేరు రావటం మాత్రం సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ తనకు రాసిపెట్టి ఉండటం దైవ సంకల్పమేనని భావిస్తున్నానన్నారు.






