ఆదేశాలు జారీ చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : పారిశ్రామిక క్లస్టర్లలో ఫార్మర్స్ ప్రోడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేయటం ద్వారా రైతులకూ ప్రయోజనం కల్పించాలని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకం ద్వారా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రసాయనాల తయారీ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. పరిశ్రమలు- మౌలిక సదుపాయాలు- పర్యాటకం అనే విధానంలో ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రతీ జిల్లాలోనూ ఓ మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కలుగుతాయన్నారు సీఎం .
ప్రతీ పారిశ్రామిక క్లస్టర్ వద్దా ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా ఏపీ ఎంఎస్ఎంఈల స్థాపనలో అగ్రస్థానంలో ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ జరగాలన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం యూనివర్సిటీల్లోనూ కోర్సులను హైబ్రీడ్ విధానంలో అందించే ఆలోచన చేయాలన్నారు. సమీక్షకు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సీఎస్ సాయి ప్రసాద్, పరిశ్రమలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాలు, అటవీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.






