పోకిరీలకు ఫుల్ క్లాస్ పీకిన అధికారిణి
సికింద్రాబాద్ : హైదరాబాద్ నగరంలో పోకిరీలు రెచ్చి పోయారు. ఐపీఎస్ అధికారిణినే వస్తావా.. నీ రేటు ఎంత అని అడిగారు. వారికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్ సర్కిల్ లో చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా ఇటీవలే సుమతి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. కొలువు తీరిన వెంటనే సుమతి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులపై దృష్టి పెట్టారు. రాత్రి 12 గంటల సమయంలో దిల్సుఖ్నగర్ బస్టాండ్లో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, సాధారణ మహిళలా వేషం మార్చుకుని బస్టాండ్లోకి వెళ్లారు. ఆమె ఎవరో తెలియక కొందరు పోకిరీలు ఆమెను చుట్టుముట్టి వస్తావా? నీ రేటు ఎంత? ఎంతివ్వాలంటూ అంటూ వెకిలి ప్రశ్నలు అడగడం ప్రారంభించారు.
ఆ మూడు గంటలలో ఎలాంటి పెట్రోలింగ్ వాహనం గానీ, పోలీసులు గానీ అక్కడికి రాక పోవడంతో మరింతగా రెచ్చి పోయారు.. అక్కడ ఉన్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు మద్యం, గంజాయి మత్తులో ఉన్నట్టు ఆమె గుర్తించారు. మూడున్నర గంటల తర్వాత ఒక బీట్ కానిస్టేబుల్ అక్కడికి రావడంతో ఆమె గుర్తింపు బయట పడింది. వెంటనే ఎస్సై వచ్చి సెల్యూట్ చేయడంతో ఆమె కమిషనర్ సుమతి అని తెలిసింది. మొత్తం దాదాపు 40 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, మద్యం–గంజాయి అలవాట్లు, రోడ్లపై అసభ్య ప్రవర్తనపై గట్టి హెచ్చరిక చేశారు.





