విశాఖలో రూ.1 లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్కు గ్రీన్ సిగ్నల్
అమరావతి : రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వస్తోంది. విశాఖలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అలాగే సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను కూడా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును, తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు పలు పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతీ ప్రతిపాదనా ఒప్పందంగా మారాలని, కుదుర్చుకున్న ప్రతీ ఒప్పందం పెట్టుబడిగా రూపాంతరం చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ఒక పెట్టుబడి, పరిశ్రమ రాష్ట్రానికి వచ్చే విషయంలో అనుమతుల నుంచి శంకుస్థాపన, ప్రారంభోత్సవం వరకు నిర్దేశిత గడువులోగా జరిగేలా చూడాలన్నారు. ఒప్పందం చేసుకున్న కంపెనీల శంకుస్థాపన నుంచి ఉత్పత్తి వరకూ నిర్దుష్టమైన కాలపరిమితిలో జరిగేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన అనుమతుల విషయంలో ఒక్క రోజు కూడా జాప్యం జరగకూడదు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనుమతుల జారీ విషయంలో ఏపీ బ్రాండ్ సృష్టించాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇతరుల కంటే మనం ఎలా భిన్నమో ఏపీలో అనుమతులు ఎంత సులభతరమన్నది చాటి చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ప్రాజెక్టులు రావాలన్న తపన ఉన్న అధికారులను అనుమతులు ఇచ్చే స్థానాల్లో నియమించాలని సూచించారు.





