సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
అమరావతి : ఇక నుంచి అన్ని వ్యవస్థలు, శాఖల వ్యవహారాలన్నీ ఆన్ లైన్ లోనే ఉండాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. దీని వల్ల అవినీతికి చెక్ పెట్టవచ్చని చెప్పారు. మాన్యువల్ టచ్ పాయింట్ల వద్దకు వచ్చే ప్రజలకు వాట్సప్ వినియోగాన్ని వివరించాలని సూచించారు కలెక్టర్లకు. స్మార్ట్ ఫోన్లు లేని కుటుంబాలు 34 శాతంగా ఉన్నాయన్నారు. ఆన్ లైన్ సేవల ద్వారా అవినీతితో పాటు దుర్వినియోగం కూడా తగ్గుతుందన్నారు. అవేర్ 2.0 నుంచి వచ్చే సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పిడుగుల హెచ్చరికలను జారీ చేయటంలో ఇంకా పర్ఫెక్షన్ రావాలి. తుపాన్ల హెచ్చరికల సమయంలో నేరుగా మొబైళ్లకే మెసేజిలు పంపించాలి.
తుపాన్ల హెచ్చరికలను స్వర్ణ గ్రామ,వార్డుల ద్వారా కూడా పంపించాలి. సీవీడ్ సాగుపై తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు దృష్టి పెట్టాలి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టాలి. మున్సిపాలిటీలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఎలాంటి అక్రమ నిర్మా్ణాలూ లేకుండా చూడాలి అని సీఎం ఆదేశించారు. ఇక అవేర్, డేటా లేక్ అంశాలపై జరిగిన సమీక్షలో భాగంగా కొన్ని కీలక సూచనలు చేశారు. పరిపాలనలో భాగంగా వేర్వేరు వెబ్ సైట్లు, డ్యాష్ బోర్డులు కాకుండా ఒకే ప్లాట్ ఫాంపై ఉండేలా చూడాలని ఐటీ శాఖకు సూచించారు. అన్ని శాఖలకు సంబంధించిన కేపీఐలతో ఓ డ్యాష్ బోర్డు తయారు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ తెలిపారు. రోజువారీ లక్ష్యాలను ఈ డ్యాష్ బోర్డు నుంచి గుర్తించి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుందని మంత్రి చెప్పారు.






