99.35 లక్షల ఎకరాలకు సాగునీరు
అమరావతి : ఏపీ లో కూటమి సర్కార్ కొలువు తీరడంతో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా సాగు నీటి రంగంపై దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్ లో అత్యధికంగా నిధులను కేటాయించింది. ప్రధానంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులకు మరమ్మతులను చేపట్టింది. దీని కారణంగా నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా చేసింది. దీని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సాగు పెరిగింది. 2025-26 ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 99.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగా, 887.90 టీఎంసీల నీటి వినియోగం జరిగినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే 2024-25 ఖరీఫ్లో 96.22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పారు.
గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్, వంశధార, తాడిపూడి, ఎస్ఆర్బీసీ, తుంగభద్ర తదితర ప్రధాన ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని రైతులకు ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, ఎరువులు, సాగునీటి లభ్యతపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. ఎటువంటి నీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు పూర్తి మద్దతు అందిస్తాయని ఆయన స్పష్టం చేశారు.





