ఎంట్రప్రెన్యూర్ గా మారితేనే సంపద సృష్టికి ఛాన్స్
అమరావతి : చిన్న స్థాయిలో ప్రారంభమైన కిమ్స్ ఆస్పత్రి ఇప్పుడు విస్తరించి 30 వేల కోట్ల ఆస్తిగా మారిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. బుధవారం నిడమర్రులో బొల్లినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శంకుస్థాపన అనంతరం ప్రసంగించారు. ఎంట్రప్రెన్యూర్ గా మారితేనే దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టికి అవకాశం ఉంటుందన్నారు. అమరావతి అభివృద్ధి కావాలంటే చాలా మంది పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో గతంలో చాలా తక్కువ ఆస్పత్రులు హోటళ్లు మాత్రమే ఉండేవి, కన్వెన్షన్ సెంటర్లు కూడా ఉండేవి కావు అన్నారు. ఇప్పుడు దేశానికే మెడికల్ హబ్ గా హైదరాబాద్ తయారైందని అన్నారు. ఇదంతా తాను తీసుకున్న ముందు చూపు నిర్ణయాల వల్ల జరిగిందన్నారు సీఎం.
దీనికి కిమ్స్ లాంటి సంస్థలే కారణం అన్నారు. అమరావతి రాజధానిలో ఇదో వినూత్న ప్రయోగం విద్య, వైద్యంలో తిరుగు స్థాయిలో ఉండేలా 23 ఎకరాల్లో కాలేజీ, 2 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటవుతోందని వెల్లడించారు. మెడికల్ కాలేజీ, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి లక్ష మందికి నైపుణ్యం అందించేలా సంస్థ ఏర్పాటు కానుందన్నారు సీఎం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైద్యులతో పాటు నర్సులు, పారామెడికల్ సిబ్బంది టెక్నీషియన్లు చాలా అవసరం ఉందన్నారు . డాక్టర్ కూడా ఏఐ నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. 23 నెలల కంటే ముందు రాష్ట్రంలో ఆరాచకం, విధ్వంసం జరిగింది. అలాంటి పాలన నా జీవితంలో చూడలేదని అన్నారు.





