కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత
అమరావతి : వచ్చే ఏడాది మరో 10 కొత్త గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నామని ప్రకటించారు మంత్రి ఎస్. సవిత. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించాలని సూచించారు. సమస్యలు వచ్చినప్పుడు వార్డెన్లతోగాని, తల్లిదండ్రులతోగాని తెలపాలన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని హితవు పలికారు. పట్టుదలతో ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని, భవిష్యత్తులో మీలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వైద్యులు, ఇంజినీర్లు ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, వార్డెన్లు విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు.
హాస్టళ్లు, గురుకులాల్లో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని తెలిపారు. నెట్ జీరో కార్యక్రమం కింద ప్రతి హాస్టల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు, కిచెన్ గార్డెన్ల అభివృద్ధి చేపట్టాలని సూచించారు. విద్యార్థులు మారుతున్న ప్రపంచ పోటీని ఎదుర్కొనేందుకు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. గత ఏడాదితో పోలిస్తే బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 77 శాతం నుంచి 87 శాతానికి పెరిగిందని, రెసిడెన్షియల్ స్కూల్స్ 96.4 శాతం ఫలితాలు సాధించాయని వెల్లడించారు. త్వరలోనే మంత్రి సవిత ఆధ్వర్యంలో నీట్, ఐఐటీ కోచింగ్ కోసం ప్రత్యేక కళాశాలలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. డైరెక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ, టెన్త్, ఇంటర్ లో బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల విద్యార్థులు ఈ ఏడాది గణనీయమైన ఫలితాలు సాధించారన్నారు. గత ఏడాది టెన్త్ లో ఉత్తీర్ణత శాతం 77.22 శాతం కాగా, ఈ ఏడాది 86.09 శాతానికి పెరిగిందని వెల్లడించారు.





