స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతులకు తీపి కబురు చెప్పింది. రైతులు నష్ట పోకుండా కనీస మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం సానుకూలంగా వ్యవహరించిందని వెల్లడించారు రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్దక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన MSPలను పూర్తిస్థాయిలో పొందేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ప్రత్యేకించి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు, మార్కెటింగ్ వ్యవస్థ, మద్దతు ధర అమలు ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి. రైతాంగానికి అండగా నిలుస్తూ వ్యవసాయ రంగాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలకు రాష్ట్ర రైతుల తరఫున అచ్చెన్నాయుడు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో రైతులకు మేలు చేకూర్చేలా సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనివ్వమని పేర్కొన్నారు.





