చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా ఒప్పందాలు
అమరావతి : చేనేతలకు 365 రోజులూ పని కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు మంత్రి ఎస్. సవిత. నూతన టెక్స్ టైల్స్ పాలసీని అమలు చేసి, ఈ పాలసీ ద్వారా చేనేత రంగంలో రూ.10,000 కోట్ల పెట్టుబడుల సేకరించాలని, 1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దీనిలో భాగంగా జాతీయ హ్యాండ్లూమ్ అభివృద్ధి ప్రోగ్రామ్ కింద 10 క్లస్టర్లు ఏర్పాటు చేసిందని చెప్పారు మంత్రి. రాయదుర్గం, హిందూపురం, బ్రాండెక్స్ టెక్స్ టైల్స్ పార్కుల అభివృద్ధితో పాటు ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్క్ కూడా నిర్మించనుందని ప్రకటించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ను రూ.38.31 కోట్లతో ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. మంగళగిరిలో చేనేత పార్క్ ఏర్పాటు చేయనుంది. పిఠాపురంలో మౌలిక సదుపాయాల కల్పనకు స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నామని తెలిపారు. 9,120 మంది చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా రూ.15.11 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. రూ.172 కోట్లతో విశాఖపట్నంలోని మధురవాడలో యూనిటీ మాల్ ను నిర్మిస్తున్నారు. అమరావతిలో శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సవిత.
చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడానికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ఒకవైపు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూనే, మరింత మార్కెటింగ్ సౌకర్యాలు పెంచే ప్రణాళికల్లో భాగంగా పలు ఒప్పందాలు చేసుకుందని తెలిపారు. టాటా తనేరియా, ఆద్యం బిర్లా గ్రూప్, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్. ఏపీ హస్తకళల కార్పొరేషన్ తోనూ ఆప్కో ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచడానికి ఈ ఒప్పందాలు ఎంతగానో ఉపకరించనున్నాయని తెలిపారు సవిత.





