జూన్ 25 నుంచి తెప్పోత్సవాల కారణంగా
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. జూన్ 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు తిరుపతి లోని ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలో అమ్మ వారి తెప్పోత్సవాలను నిర్వహించినట్లు వెల్లడించింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనుందని, సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారని, ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు వెల్లడించింది టీటీడీ.
తెప్పోత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు అమ్మవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్సేవ, అలాగే జూన్ 26న జరిగే లక్ష్మీపూజలను రద్దు చేసినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససా హిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనున్నారు.
అలమేలుమంగ తల్లి దివ్య కటాక్షం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ కోరింది.






