ఎంపీలు రాజ్యాంగ స్పూర్తిని విస్మరించొద్దు
దిశా నిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్ కొణిదల
న్యూఢిల్లీ : జనసేన ఢిల్లీ వేదికగా ఎప్పుడు దేశ ప్రగతి, ఉన్నతి, పురోగతి కోసమే ఆలోచన చేస్తుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . ఢిల్లీలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.. ఇలాంటి గొప్ప వేదికను దేశ ఐక్యత, సమగ్రత కోసం ఉపయోగించుకుంటాం అన్నారు. .జనసేన పార్టీకి లోక్ సభలో ఇద్దరు ఎంపీలు, రాజ్యసభలో ఒక ఎంపీ బలం ఉంది. పార్టీ ఎంపీలపై చాలా పెద్ద బాధ్యత ఉంది. కేవలం వారి నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను మాత్రమే సభలో మాట్లాడొద్దు. ఎంపీలు యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనే విషయాన్ని మరిచిపోకండి. రాజ్యంగ స్ఫూర్తిని విస్మరించొద్దు అని సూచించారు.
దేశ ప్రతిష్టకు భంగా కలిగించే అంశాలు, సమగ్రతను నష్టం చేకూర్చే విషయాలపై జనసేన గళాన్ని పార్లమెంటు వేదికగా దేశం మొత్తానికి తెలిసేలా మాట్లాడాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో జరిగే జాతి ప్రాధాన్య అంశాల పట్ల పార్టీ గళాన్ని ప్రజలకు వినిపించాలి. రాజ్యాంగ విలువలను కాపాడాలి. దీనికి ముగ్గురు ఎంపీలు బాధ్యతగా తీసుకోవాలి. దేశ సంక్షేమానికి విఘాతం కలిగించే ప్రతి అంశంపైనా స్పందించాలి. కేవలం గిరి గీసుకొని నియోజకవర్గ సమస్యలనే ప్రస్తావించి ఆగిపోవద్దు. దేశ ప్రయోజనాలే తొలి ప్రాధాన్యం కావాలని అన్నారు.