కార్య‌క‌ర్త‌ల‌పై మ‌ల్లికార్జున ఖ‌ర్గే క‌న్నెర్ర‌

VijayaBhaskar · June 21, 2026
Spread the love

డీకేకు మ‌ద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు

బెంగళూరు : కర్ణాటక: ‘సంకల్ప సమావేశం’ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు “డీకే-డీకే” అని నినాదాలు చేయడంతో కాంగ్రెస్ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నినాదాలు చేస్తే దేశం మొత్తం ప్రభావితం అవుతుందా? ఇది ఒక వ్యక్తికి సంబంధించిన కార్యక్రమం కాదు, ఇది పార్టీ కార్యక్రమం అని అన్నారు. పనికిమాలిన వాళ్లారా… ఇక్కడ వ్యక్తుల ఆరాధన ఉండదు, మనందరినీ ఏకం చేసే పార్టీ కార్యక్రమం కోసం మనం ఇక్కడ ఉన్నాం అని మ‌రిచి పోవ‌ద్ద‌ని పేర్కొన్నారు ఖ‌ర్గే. నాకు 58 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పారు.

చాలా మంది నాయకులు ఇక్కడికి వచ్చారు; పార్టీకి వారి సహకారం తక్కువగా ఉన్నప్పటికీ, పార్టీ వారికి ఎంతో మేలు చేసిందని అన్నారు ఏఐసీసీ బాస్. ఇక్కడ నినాదాలు చేస్తున్న వారి దృశ్యాలు రికార్డై ఉంటాయని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఆ దృశ్యాలను పరిశీలించిన తర్వాత నేను క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాన‌ని మ‌రోసారి మండిప‌డ్డారు. కార్య‌క‌ర్త‌లు తెలుసు కోవాల్సింది ఏమిటంటే పార్టీనే ముఖ్యం, స‌ర్వ‌స్వం. అదే సుప్రీం అని తెలుసు కోవాల‌న్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.