రేపే రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

VijayaBhaskar · June 24, 2026
Spread the love

కొత్త‌గా ఎన్నికైన 24 మంది స‌భ్యులు

ఢిల్లీ : ఇటీవ‌ల పెద్ద‌ల స‌భ అయిన రాజ్య‌స‌భ‌కు 24 మంది పార్ల‌మెంట్ స‌భ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సంద‌ర్బంగా ఈనెల 25వ తేదీన గురువారం ఢిల్లీలో రాజ్య‌స‌భలో గెలుపొందిన వారు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. వీరిలో రేపు 10 మంది రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. రాజ్యసభ ఛాంబర్‌లో నూతన సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్ర‌ప‌తి సి.పి.రాధాకృష్ణన్. ఇక ప‌ద‌వీ ప్రమాణ స్వీకారం చేయనున్న వారిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన భాష్యం రామకృష్ణ, సానా సతీష్‌బాబు, చింతకాయల విజయ్, లింగమనేని రమేష్ ఉన్నారు.

వీరిలో లింగ‌మ‌నేని ర‌మేష్ ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌గా ఉన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి ముగ్గురు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన వారు ఎన్నిక‌య్యారు. అయితే ఇక్క‌డే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి 63 మంది స‌భ్యుల బ‌లగం ఉన్న‌ప్ప‌టికీ ఆ పార్టీ త‌ర‌పున నామినేష‌న్ దాఖ‌లు చేసిన మీనాక్షి న‌ట‌రాజ‌న్ నామినేష‌న్ స‌వ్యంగా లేదంటూ ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి తిర‌స్క‌రించారు. దీంతో ఆశించిన దానికంటే బ‌లం ఉన్న‌ప్ప‌టికీ తిర‌స్క‌ర‌ణ కార‌ణంగా సీటును కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ.