అమరావతి : ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ తీరంలో మత్స్యకారుల గల్లంతు ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారులంతా క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. గాలింపు చర్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా కొనసాగిస్తోందని చెప్పారు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు సీఎస్ తో పాటు పలువురు మంత్రులు మత్స్యకారులు గల్లంతు అయిన ఘటనపై ఆరా తీస్తున్నారు. మరికొందరు ప్రజా ప్రతినిధులు విశాఖ పోర్ట్ వద్ద ఉన్నారని తెలిపారు.
ఎప్పటికప్పుడు సహాయక చర్యల విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదన్నారు. అంతే కాకుండా మెరైన్, కోస్ట్ గార్డ్, నేవీ బృందాలు సమన్వయంతో గాలింపు చర్యలు చేపడుతున్నాయని చెప్పారు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి. మత్స్యకారుల ఆచూకీ కోసం అన్ని శాఖలు అప్రమత్తంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.















