‘మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ 2026’ కిరీటాన్ని గెలుచుకున్న హైదరాబాద్కు చెందిన ఫసిహా నౌమాన్ ఇప్పుడు ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ పోటీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. మోడల్, ఇన్ఫ్లుయెన్సర్ , ఎంబీఏ పట్టభద్రురాలైన ఫసిహా, ఈ నెల చివరలో జాతీయ వేదికపై తన రాష్ట్రం తరపున పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ పోటీలు జూలై 19 నుండి ఆగస్టు 23 వరకు జరుగుతాయి. దీని గ్రాండ్ ఫినాలే న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. ఇందులో విజేతగా నిలిచిన వారు ‘మిస్ యూనివర్స్ 2026’ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని పొందుతారు. సిహా 2018లో ‘ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ’ పోటీలో టాప్ 10 ఫైనలిస్టులలో ఒకరిగా నిలవడం ద్వారా అందాల పోటీల ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఆ సమయంలో టైటిల్ గెలవలేక పోయినప్పటికీ, ఆమె తన చదువుపై దృష్టి సారించి ఎంబీఏ పూర్తి చేశారు, అదే సమయంలో తన కలను కూడా సజీవంగా ఉంచుకున్నారు.
కాలక్రమేణా ఆమె మోడలింగ్ కెరీర్ కూడా విస్తరించింది. సబ్యసాచి ముఖర్జీ, జయంతి రెడ్డి, రా మ్యాంగో, శ్రవణ్ కుమార్, భావన రావు, నీరూస్ వంటి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లతో ఆమె పనిచేశారు. అలాగే అనేక ప్రసిద్ధ బ్రాండ్ల ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. 024లో ఫసిహా వివాహం చేసుకున్నారు. తల్లి అయ్యారు. అదే సమయంలో, ‘మిస్ యూనివర్స్’ పోటీలో వివాహిత మహిళలు , తల్లులు పాల్గొనేందుకు అనుమతి లభించడంతో, ఆమె తన కలను సాకారం చేసుకునే మరో అవకాశం దక్కింది. బిడ్డకు జన్మనిచ్చిన కేవలం మూడు నెలలకే ఆమె తిరిగి అందాల పోటీల వేదికపైకి వచ్చారు. వెంటనే విజయం సాధించలేక పోయినప్పటికీ, ఆమె కృషిని కొనసాగించి, చివరకు ‘మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ 2026’ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.















