అమరావతి : ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా యువతకు ఉద్యోగాలు కల్పించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ విస్తృతంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. పరిశ్రమల రాకతో ఉన్నత ఉద్యోగాలు పూర్తి కాగానే యువతకు స్థానికంగానే ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. ఈ రెండూ అందుబాటులోకి వస్తే రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరంగా దూసుకు పోవడం తథ్యమని మంత్రి సవిత ధీమా వ్యక్తంచేశారు. మెగా పీటీఎం నిర్వహణతో విద్యార్థుల ప్రగతితో పాటు వారి మానసిక, శారీరక స్థితిగతులపైనా తల్లిదండ్రులకు మరింత అవగాహన కలుగుతుందన్నారు.
ఈ ఏడాది మే నెలలో విడుదలైన టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఎంజేపీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. వచ్చే ఏడాది మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని మంత్రి సవిత ఆకాంక్షించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నారన్నారు. మెగా పీటీఎం నిర్వహణతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అవగాహన పెరిగి, విద్యార్థుల అభివృద్ధికి మరింత దోహద పడతారన్నారు. అనంతరం మంత్రి సవిత విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజక వర్గ ఇన్చార్జి పొత్తూరి రామరాజు, ఎంజేపీ స్కూళ్ల కార్యదర్శి మాధవీలత సహా పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.






