మొబైల్ ఫోన్ల వినియోగంపై సింగరేణి నిషేధం
కరీంనగర్ జిల్లా : సింగరేణి బొగ్గు గనుల సంస్థ సంచలన ప్రకటన చేసింది. బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులు మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించినట్లు వెల్లడించింది. భద్రతా కారణాలు, పని ప్రదేశాల్లో కార్మికులు ‘రీల్స్’ (చిన్న వీడియోలు) చిత్రీకరించే ధోరణి పెరుగుతుండటంతో, సింగరేణి కాలరీస్ భూగర్భ , ఓపెన్కాస్ట్ గనుల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించింది. ఈ మేరకు ఇటీవల ఒక ఉత్తర్వు జారీ చేసింది. వినూత్న పద్ధతుల్లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే ధోరణి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సింగరేణి బొగ్గు గనుల్లోనూ ఇలాంటి పద్ధతులు కనిపిస్తున్నాయి. కార్మికులు , ఉద్యోగులు పని ప్రదేశంలో సెల్ఫీ వీడియోలు తీయడం , రీల్స్ చేయడం చేస్తున్నారు. కొందరు కార్మికులు భూగర్భ గనుల్లోకి వెళ్లేటప్పుడు ‘మ్యాన్-రైడర్స్’ (కార్మికులను తీసుకెళ్లే వాహనాలు)లో ఉంటూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.
రాజకీయ నాయకులు బొగ్గు గనులను సందర్శించినప్పుడు, వారితో ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు తీసుకోవడానికి కార్మికులు, ఉద్యోగులు పోటీ పడుతుంటారు. ఈ విషయాలన్నీ చైర్మన్ దృష్టికి వెళ్లడంతో ఆంక్షలు విధించారు. మొబైల్ ఫోన్లు చూస్తూ భారీ వాహనాలను నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అలాగే ఉత్పత్తి తగ్గుతుందని యాజమాన్యం భావించింది. సుమారు 80 శాతం బొగ్గు ఓపెన్కాస్ట్ గనుల్లోనే ఉత్పత్తి అవుతోంది. క్వారీల నుండి బొగ్గును తరలించడానికి హాల్ ట్రక్కులు , ఇతర భారీ వాహనాలను ఉపయోగిస్తారు. వాహనాలు నడిపేటప్పుడు ఆపరేటర్లు ఫోన్లు వాడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.