హైదరాబాద్ : హైడ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా వాణి లో 42 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా అదనపు కమిషనర్ డి. ఆనంద్ కుమార్ వెల్లడించరు. సమస్యల పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూరు గ్రామం పరిధిలోని సర్వే నంబర్లు 215 నుండి 224 వరకు సుమారు 100 ఎకరాల భూదాన్/ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇందులో కొంతమేర ఆక్రమణలు జరిగాయి. అంతే కాకుండా సుమారు 60 ఎకరాల భూమిలో 2015లో ఒక లేఅవుట్ ఏర్పాటు చేశారు. ఆ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన కొందరు ఇళ్లు నిర్మించుకోగా అప్పట్లో వాటిని తొలగించారు. ఆ తర్వాత ఆక్రమణలు పెరిగి పోయాయి. లే అవుట్లో ప్లాట్లు కొన్నవారికి ఆ భూమి దక్కుతుందా లేక ప్రభుత్వానికే చెందుతుందా అనేది పక్కన పెడితే, మధ్యలో ఆక్రమణలు జరగడం మాత్రం సరికాదు. హైడ్రా జోక్యం చేసుకుని, కంచె ఏర్పాటు చేసి, ఆ భూములను రక్షించాలని కుంట్లూరు గ్రామంలోని పాపయ్యగూడెం నివాసితులు ‘హైడ్రా ప్రజావాణి’లో కోరారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలోని సర్వే నంబర్లు 192 నుండి 199, 215, 216 పరిధిలో సుమారు 254.36 ఎకరాల భూమిలో 1980లో ‘భవాని నగర్’ పేరుతో లేఅవుట్ ఏర్పాటు చేశారు. ఈ లేఅవుట్లో రోడ్లు , పార్కుల సరిహద్దులు చెరిగి పోయాయి, అలాగే మొత్తం భూమి ఆక్రమణకు గురవుతోంది. హైడ్రా జోక్యం చేసుకుని ఈ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని భవాని నగర్ లేఅవుట్ ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేశారు. సరూర్నగర్ మండలం మన్సూరాబాద్ గ్రామంలోని ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వీకర్ సెక్షన్ కాలనీ’లో 1985 నాటి HUDA లేఅవుట్ ప్రకారం ప్రజల అవసరాల కోసం కేటాయించిన ఖాళీ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు వాపోయారు. ప్రజా ప్రయోజనాల కోసం లేఅవుట్లో కేటాయించిన ఆ భూమిని రక్షించాలని, అక్రమ నిర్మాణాలను తొలగించి, దానిని తిరిగి ప్రజల వినియోగంలోకి తీసుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు.
మహేశ్వరం మండలంసర్దార్ నగర్ గ్రామం పరిధిలోని ఒక పెద్ద చెరువు (ID-2404) యొక్క ప్రాథమిక FTL (పూర్తి నీటి మట్టం), బఫర్ జోన్ పరిధికి వెలుపల ఉన్న భూముల్లోకి యజమానులు వెళ్లకుండా అడ్డుకునేందుకు కొందరు వ్యక్తులు అక్కడ కృత్రిమంగా నీటిని నిల్వ చేస్తున్నారని ఒక బాధితుడు HYDRA దృష్టికి తీసుకు వచ్చారు. సర్వే నంబర్లు 35–40, 47–54, 56–60, 62–70, 76, 77, 78, 79 పరిధిలోని భూములు FTL పరిధిలోకి రానప్పటికీ, గత ఐదేళ్లుగా అక్కడ నీరు నిలిచి ఉండటం వల్ల తాము ఆ భూములను వినియోగించు కోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.






