ఏపీలో రేషన్ దుకాణాల్లో నాణ్యమైన బియ్యం
అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా పేదలకు నాణ్యమైన బియ్యం అందజేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్బంగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టును తొలిసారిగా దేశంలోనే ఏపీలోని కాకినాడలో అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక డిపోల్లో నాణ్యమైన స్టీమ్ రైస్ బియ్యాన్ని అందజేయాలని నిర్ణయించాం అన్నారు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రజా పంపిణీ ద్వారా ప్రతి రైసు కార్డుదారుడికి, అలాగే పాఠశాలలు, హాస్టల్స్ కు కలిపి జిల్లాకు 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయని అంచనా వేస్తున్నాం అన్నారు. ఇక్కడ వచ్చిన ఫలితాలకు అనుగుణంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా స్టీమ్ రైస్ ను చౌకడిపోల్లో అందించేలా ప్రణాళికతో ముందుకు వెళ్తాం అని తెలిపారు .
దీంతోపాటు రైతాంగం నుంచి వచ్చిన అభ్యర్థనలను కేంద్ర ప్రభుత్వ అధికారుల వద్ద ప్రస్తావించినపుడు బాయిల్ట్ రైస్ ధాన్యం కోటాను మరికొంత పెంచడానికి అంగీకరించామన్నారు. గతంలో ఢిల్లీలో పర్యటించినపుడు మొట్టమొదటిసారి రాష్ట్రానికి అనువుగా 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్ట్ రైస్ ధాన్యం సేకరణకు అంగీకరించినట్లు తెలిపారు మనోహర్. ఇప్పుడు దానికి అదనంగా మరో 20 వేల మెట్రిక్ టన్నుల సేకరణకు ఒప్పుకున్నారన్నారు. ప్రతి గింజను రైతు దగ్గర నుంచి కొంటామని ఇచ్చిన మాటను పూర్తిగా నెరవేరుస్తున్నాం. నాణ్యమైన బియ్యం ఇవ్వాలనేది తమ కూటమి ప్రభుత్వం లక్ష్యమని స్పస్టం చేశారు.