పాదచారుల భద్రతపై దృష్టి సారించాలి
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో పాదచారుల భద్రతపై దృష్టి సారించాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్పష్టం చేశారు. ట్రాఫిక్, రహదారి మౌలిక సదుపాయాలు, వర్షాకాల సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కీలక మీటింగ్ లో 334 రహదారి మౌలిక సదుపాయాల పనులు, రీ-కార్పెటింగ్/గుంతల పూరణ కోసం 245 దెబ్బతిన్న రహదారి ప్రాంతాలను గుర్తించడం, పెండింగ్లో ఉన్న 25 పాదచారుల వంతెన (FOB) పనులు చేపట్టడం, 65 సైన్బోర్డ్ , లైటింగ్ పనులు, తక్షణ చర్య అవసరమైన 9 రహదారి ఆక్రమణ ప్రాంతాలు, 53 ఫుట్పాత్/జంక్షన్ పనులు చేపట్టడం, 13 రహదారి విస్తరణ ప్రతిపాదనలు సిద్దం చేయడం, నీరు నిలిచే అవకాశం ఉన్న 85 ప్రాంతాలను గుర్తించడం పై చర్చించారు కమిషనర్.
సంబంధిత శాఖలన్నింటినీ క్షేత్రస్థాయిలో తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవని పేర్కొన్నారు. నిర్దేశించిన గడువులను పాటించాలని, సైబరాబాద్ వ్యాప్తంగా పాదచారుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, రహదారి మౌలిక సదుపాయాలు , వర్షాకాల సన్నద్ధతలో స్పష్టమైన మెరుగుదలలు కనిపించేలా చూడాలని పేర్కొన్నారు. సైబరాబాద్ పరిధిలోకి వచ్చే ప్రతి చోటా పాదచారులకు ఎలాంటి ఇబ్ందులు తలెత్తకుండా చూడాలని స్పష్టం చేశారు కమిషనర్. అడపా దడపా కురిసే వర్షాల కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో పాదచారులు నడిచేందుకు సైతం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు.