నిరుద్యోగుల అసంతృప్తిని అర్థం చేసుకోవాలి
హైదరాబాద్ : నిరుద్యోగుల దెబ్బకు దిగి వచ్చారు శాసన మండలి సభ్యులు కోదండరాం రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవలే హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో ఆయన వారి నుంచి తప్పించుకుని పారి పోయేందుకు ప్రయత్నం చేశారు. రాజకీయ నాయకులు ఎన్ని ఏళ్లయినా ఎన్నికల్లో పోటీ చేయొచ్చని, కానీ మాకు ఎందుకు వయో పరిమితి విధిస్తున్నారంటూ కోదండరాం రెడ్డిని నిలదీశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మీరు చెప్పినందుకే తాము ఓటు వేసి గెలిపించామన్నారు.
దీంతో కోదండ రాం రెడ్డి స్పందించారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని, ఆందోళనను ప్రభుత్వంలో ఉన్నవారు లేదా అధికారులు అర్థం చేసుకుంటున్నట్లు కనిపించడం లేదని అన్నారు . ఇది ఇప్పుడు ఒక ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం పట్ల నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారి అసంతృప్తిని అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా వ్యవహరించాలని లేక పోతే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. తాజాగా కోదండ రాం రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.