హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత రావు కేంద్రంపై సంచలన కామెంట్స్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వక పోవడం వెనుక బీజేపీ నేతల కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. శుక్రవారం బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనే “వికసిత్ భారత్” లో తెలంగాణ రాష్ట్రం ఉండొద్దనే కుట్రలు ఉన్నాయని తమకు అర్ధం అవుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు కోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టింస్తోందని విహెచ్ ఆరోపించారు.
మెజారిటీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జనాభా దామాషాలో న్యాయం జరగాలన్న రాహుల్ గాంధీ లక్ష్యం కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు వి. హనుమంత రావు. కేంద్రం చేపట్టే జనగణన గణాంకాల్లో ఓబీసీ జనాభా లెక్కలు చూపకుండా బీజేపీ మోకాలడ్డుతుందని విమర్శించారు. CWC లో నిర్ణయం తీసుకున్న ప్రకారం ఈ నెల 25వ తేదీన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. దేశ వ్యాప్తంగా పేరు పొందిన పార్టీకి చెందిన బహుజన నేతలు హాజరవుతారని వెల్లడించారు. ఈ ఓబీసీ సభ ద్వారా తమ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు వి. హనుమంత రావు.





