హైదరాబాద్ : మహానటి షావుకారు జానకి శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి పట్ల సినీ రంగానికి చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. తను తుది శ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. షావుకారు జానకితో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. నాన్న దివంగత సీఎం నందమూరి తారక రామారావు హీరోగా రిలీజైన తొలి చిత్రం ‘షావుకారు’తోనే ఆమె ‘షావుకారు జానకి’గా సుప్రసిద్ధులయ్యారని తెలిపారు. అలా నాన్నకు జానకి తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నతో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకి.
మా యన్.ఏ.టి. బ్యానర్ లో రూపొందిన తొలి చిత్రం ‘పిచ్చిపుల్లయ్య’లో కీలక పాత్ర ధరించారు. ‘పాండురంగ మహాత్మ్యం’ నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకి కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను ‘తాతమ్మకల’లో మహానటి భానుమతి ముని మనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత “రామ్ – రహీమ్, వేములవాడ భీమకవి” చిత్రాల్లో షావుకారు జానకితో నటించే అదృష్టం నాకు దక్కిందన్నారు బాలకృష్ణ. మన దేశంలో 75 ఏళ్ళ సుదీర్ఘ నటనా ప్రస్థానం చూసిన ఆర్టిస్ట్ షావుకారు జానకి ఒక్కరే అని పేర్కొన్నారు. అంతటి సుదీర్ఘ నటనా జీవితంలో ఎన్నెన్నో మరపురాని పాత్రల్లో జనాన్ని మెప్పించారు జానకి. ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని తెలిపారు నందమూరి బాలకృష్ణ.







