newsseals.com

ఉపాధి హ‌మీ నిధుల‌ను పార‌ద‌ర్శ‌కంగా వినియోగించాలి

August 22, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ్రామ స్థాయిలో అనుబంధం ఉన్న అన్ని శాఖలను ఏకతాటిపైకి తీసుకువచ్చి సమావేశం నిర్వహించడం అభినందనీయమని ప్ర‌శంసించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కూడా అన్ని శాఖల అధికారులు కలిసి పని చేయాలని, తమ కోసం అధికారులు కష్టపడి పని చేస్తున్నారనే నమ్మకం ప్రజల్లో కలిగించాలని అన్నారు. ప్రజల మేలు కోసం పనిచేసే అధికారులను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచు కుంటారని తెలిపారు.

ఉపాధి హామీ నిధులను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ఖర్చు చేయాలని ఆదేశించారు తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు. నీటి సంరక్షణ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎల్‌నినోను ఆపడం మన చేతుల్లో లేకపోయినా, దాని ప్రభావంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం మన చేతుల్లోనే ఉందన్నారు. భారీ ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికీ సుమారు 30 లక్షల బోర్లపై సాగు ఆధారపడి ఉందన్నారు. అందువల్ల భూగర్భ జలాలను పెంచే పనులను ఉపాధి హామీ ద్వారా విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలని, గత రెండేళ్లలో లక్ష ఎకరాల్లో పామాయిల్‌ సాగును పెంచామని, ప్రతి ఏడాది రెండు లక్షల ఎకరాల్లో పామాయిల్‌ తోటలను పెంచడమే లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు పనిచేయాలని సూచించారు.

Related News