కేబినెట్ లో బీసీలకు సరైన వాటా దక్కలేదు
హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ టీవీ ఛానల్ తో జరిగిన సంభాషణలో రాష్ట్రంలో చోటు చేసుకున్న వివాదాలు, అంతర్గత విభేదాలు, రాజకీయ పరిణామాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం సామాజిక వర్గాలైన రెడ్లు వర్సెస్ బీసీలు గా ఆధిపత్య పోరు కొనసాగుతోంది . అత్యధికంగా జనాభా కలిగిన బహుజనులకు రాష్ట్ర మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యత లభించడం లేదని బీసీలకు చెందిన సంఘాలు, మేధావులు, పౌర సమాజం గత కొంత కాలంగా ఆందోళన చేపడుతూ వస్తోంది.
ఈ తరుణంలో మహేష్ కుమార్ గౌడ్ చేసిన సీరియస్ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో సీరియస్ చర్చకు దారితీసేలా చేశాయి.బీసీలకు మంత్రి వర్గంలో దక్కాల్సిన వాటా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేబినెట్ లో కొనసాగుతున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని తొలగించి మరో బిసికి ఇవ్వడం కరెక్ట్ ఎలా అవుతుందని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు . ఇవ్వాలి అనుకుంటే మంత్రుల సంఖ్య పెంచి బీసీలకు ఇవ్వాలని కోరారు. సురేఖ మంత్రి పదవిపై ఒక వైపు తీవ్ర.చర్చ జరుగుతున్న సందర్భంలో.మహేష్ చర్చలో చేసిన కామెంట్స్.. ఆసక్తికరంగా మారాయి.