వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం
అమరావతి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారన్నారు. ఈ సందర్బంగా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సోమవారం నాటితో 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల సాకారమైందన్నారు. ఆయన దూరదృష్టితో వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేశారన్నారు. నిర్వాసిత కుటుంబాలకు 48 రోజుల్లోనే రూ.762 కోట్ల పరిహారం పంపిణీ చేసిన ఘనత సీఎంకే దక్కిందన్నారు. వెలిగొండతో కరువు ప్రాంతాల్లో రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరించాయని పేర్కొన్నారు. ఇవాళ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సాగునీరు, తాగునీటితో ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, రైతుల ఆశలు, ప్రజల ఆకాంక్షలకు ప్రతీక వెలిగొండ అని పేర్కొన్నారు. అభివృద్ధికి స్వాగతం పలుకుతున్న మార్కాపురం జిల్లా ప్రజలకు వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరవు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేలా వెలిగొండ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిందన్నారు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తూ త్యాగాలు చేసిన నిర్వాసితులకు ధన్యవాదాలు తెలిపారు. కరవుతో పాటు ఫ్లోరైడ్ సమస్యతో అల్లాడుతున్న మార్కాపురం ప్రాంత ప్రజలకు రక్షిత మంచి నీరు అందించి ఫ్లోరైడ్ సమస్య నుంచి విముక్తి కల్పించడం జరుగుతుందన్నారు. తాగు, సాగు నీరు అందించడంతో పాటు ఈ ప్రాంతంలో ఉద్యాన సాగును అభివృద్ధి చేయనున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రజా ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో పని చేస్తోందని చెప్పారు.