అమరావతి : అమరావతిలోని వేంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణ పనులను టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ పరిశీలించారు. 2వ ప్రాకారం, నాలుగు గాలి గోపురాల పనుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆలయంలోని 2వ ప్రాకారం, నాలుగు గాలి గోపురాల నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని సూచించారు.
పనుల సందర్భంగా ఎదురయ్యే సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకు రావాలని ఆదేశించారు. నిర్మాణానికి సంబంధించి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ఆలయానికి భక్తులు వచ్చేలా చూడాలన్నారు. పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఏ మాత్రం తేడా వచ్చినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. జేఈవో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఈ సురేంద్ర, సూపరింటెండెంట్ మల్లికార్జున, టెంపుల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.







