తిరుమలలో వసతి సౌకర్యాలపై చైర్మన్ ఆరా
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవంగా జరింది గరుడ వాహన సేవా. లక్షా 80 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు స్వామి వారిని. ఈ సందర్బంగా భక్తులకు అందుతున్న వసతి సౌకర్యాల పట్ల ఆరా తీశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏఈవో వెంకయ్య చౌదరి. గరుడ వాహన సేవను పురస్కరించుకుని టీటీడీ చేపట్టిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు కురిపించారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్త బాంధవులు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో డా. ఎ. శరత్, సీవీఎస్వో కె.వి. మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు, బోర్డు సభ్యులు, ఇతర అధికారులతో కలిసి శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీలను చైర్మన్ పరిశీలించారు. గరుడ సేవను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం, వారు సంతృప్తి వ్యక్తం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు చైర్మన్ బీఆర్ నాయుడు.
ఈ సందర్బంగా శ్రీవారి సేవకులు, టీటీడీ ఉద్యోగులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి 15 రకాల తో మెనూ రూపొందించినట్లు తెలిపారు. ఉత్సవాల సందర్బంగా కల్పిస్తున్న అన్నప్రసాదం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను ఆయన స్వయంగా పరిశీలించి, భక్తులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టి, నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు .